21 పంచతంత్ర కథలు, వాటి నీతి

Written by Aastha Sirohi linkedin_iconfacebook_iconinsta_icon Experience: 3 years
Last Updated on

పూర్వం సుదర్శనుడనే రాజు కి నలుగురు కుమారులుండేవారు. వారికి చదువంటే ఇష్టం లేదు. వాళ్ళు బొత్తిగా అప్రయోజకులౌ తున్నారని రాజు చాలా బాధపడి,ఆ రాజ్యం లోని పండితులని,గురువులని,తన పిల్లలకి చదువు చెప్పమని ఆదేశించాడు . కానీ వాళ్ళు ఎవ్వరూ పిల్లలకి చదువు చెప్పలేకపోయారు.

అంత విష్ణుశర్మ అనే సంస్కృత పండితుడు పిల్లలని విద్యావంతులుగా చేసి, లోకజ్ఞానం, పరిపాలనా దక్షత సమకూర్చేట్టుగా ఒక ఉపాయం ఆలోచించాడు. పిల్లలకి కధలు అంటే చాలా ఇష్టంకదా కావున వాటి ద్వారా రాజకుమారులను విద్యావంతులుగా చేద్దాం అని నిర్ణయించుకున్నారు.

మనసుకి హత్తుకునే విధంగా పంచతంత్రం అనే కధలని వాళ్లకి చెబుతూ, ముఖ్యంగా అడవి జంతువులతో, కూడిన ఎన్నో చక్కటి నీతి కధలని మనకి అందించాడు. దానిని తెలుగు లోకి శ్రీ పరవస్తు చిన్నయ సూరి అనే పండితుడు అనువదించాడు. ఇవి మనకి గొప్ప సంపద. ఈ కథలనే మోంజుంక్షన్ మీకు ఇక్కడ వివరిస్తుంది. ఈ పంచతంత్ర చిన్న కథలను, వాటి లో ఉన్న నీతి ని మీ చిన్నారులకి చదివి వినిపించండి.

పంచతంత్ర చిన్న కథలు, వాటిలో నీతి

పంచతంత్రం అంటే అయిదు విధానాలు. అవి:

  1. మిత్ర లాభము (మిత్రుల వలన లాభాలు)
  2. మిత్ర భేదము (మిత్రుల మధ్య బేధాలు)
  3. అపరిక్షితకరకం (అనాలోచితంగా వచ్చే నష్టాలు)
  4. లబ్ద ప్రణాసం (ఏ నష్టమూ లేకుండా ప్రమాదాల్లోoచి బయట పడటం)
  5. కాకోలు కీయం (యుద్ధము – శాంతి, బలమైన శత్రువుని ఓడించే పథకాలు)

ఇవన్నీ గొలుసు కధలుగా ఉంటాయి. మనకి సులువుగా ఉండాలని విడి విడి గా చెప్పుకున్నాము. ఒక్కో విధానం లోంచి కొన్ని కథలను క్రిందన చూద్దాం.

మిత్రలాభం కధలు:

1. నలుగురు స్నేహితులు, వేటగాడు

Four friends, hunter

ఒక అడవిలో కాకి, తాబేలు, జింక, ఎలుక మంచి స్నేహితులుగా కాలక్షేపం చేస్తుండేవారు. ఒక రోజు జింక వాళ్ళ సమావేశానికి రాలేదు. మిగతా ముగ్గురూ ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. “కాకి, నువ్వు పైకి ఎగిరి, జింక ఎక్కడైనా ప్రమాదం లో చుక్కుకుందేమో చూడ వూ?” అంది తాబేలు.

కాకి పై కెగిరి,”అయ్యో! జింకని ఒక వేటగాడు వలలో బంధించాడు. ఆ వేటగాడు అక్కడ లేడు కనక, వెంటనే ఎలుకని నాతోతీసుకెళ్తా,” అంటూ ఎలుకని కాకి బంధించియున్న జింక ముందు దింపింది. ఎలుక తన పదునైన పళ్లతో వలని కొరికి, జింక ని బైట పడేసింది. జింక, “ఆహా! మంచి స్నేహితుల వలన ఎంత మేలు జరుగుతుందో!” అని ఆనందించింది.

ఇంతలో తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ రావటం గమనించి, “అయ్యో ! తాబేలు అంత నెమ్మదిగా వొస్తోంది, ఇప్పుడు హఠాత్తుగా వేటగాడు వొస్తే, నేను ఆకాశం లోకి ఎగరగలను,జింక,ఎలుకా కూడా వేగంగా తప్పించుకోగలవు…కానీ తాబేలు?” అని కాకి అంటుండగానే వేటగాడు వొచ్చి, తాబేలుని పట్టుకుని, తన దగ్గరున్న కర్రకి తాడుతో కట్టేసాడు.

“అయ్యో మన మంచి స్నేహితుడు తాబేలుని ఎలా రక్షించాలి ?” అని ఆలోచించి, ఒక పథకం వేసాయి. “వేటగాడు ఎలాగు చెరువు దగ్గరకే వెళ్లి తాబేలు ని కిందకి దించుతాడు. జింక వాడికి కనిపించేలాగా ఒక చోట పడి, చచ్చినట్టు వేషం వేస్తుంది. దాని కన్ను పొడుస్తున్నట్టు నేను నటిస్తుంటా. వాడు అంతదూరం నడుస్తూ వొచ్చేలోగా, ఎలుక వెళ్లి , తాబేలు కి కట్టిన తాడు కొరికి తాబేలు చెరువు లోకి దూకేలాగా సహాయం చేస్తుంది. తీరా అంతదూరం వేటగాడు నడుస్తూ వొచ్చేసరికి, హఠాత్తుగా జింక లేచి పరుగు తీస్తుంది, నేను ఆకాశం లోకి ఎగిరి పోతా,”అన్నది కాకి. ఈపథకం ప్రకారం వారు నటించి వేటగాడిని మోసం చేసి, ప్రాణరక్షణ చేసుకున్నారు.

నీతి: స్నేహం చాలా గొప్పది. స్నేహితులు సదా ఒకరికొకరు సహాయం చేసుకుంటే సాధించలేనిది ఏమీలేదు.

2. పావురాలు, బోయవాడు

Pigeons

అడవిలో ఒక బోయవాడు కొన్ని నూకలు నేలమీద చల్లి, దానిపై వలని పరిచి ఉంచాడు. చిత్రగ్రీవ అనే పావురం తన వెనకాల కొన్ని పావురాల గుంపు తో ఆహారం కోసం తిరుగుతూ, అడవిలో ఆ చెట్టు కింద నూకలు చూసి, తినాలని ఆశపడి , కిందికి వాలింది. దాని వెనకే అన్ని పావురాలు వాలి, వేటగాడు పరిచిన వలలో చిక్కుకున్నాయి.

తామంతా వేటగాడి వలలో చిక్కుకున్నామని గ్రహించి , ఆందోళనతో గొడవ చేయసాగాయి. చిత్రగ్రీవుడు తన స్నేహితులకి కంగారు పడవద్దని, తగిన ఉపాయం ఆలోచించి, బైట పడదామని , ధైర్యం చెప్పాడు. “అందరం ఒక్కసారిగా వల తో పాటు ఎగిరిపోదాం. అలా కలిసికట్టుగా ఒక్కసారిగా ఎగిరిపోయి తప్పించుకుందాం” అని ఉపాయం చెప్పాడు. అన్ని పావురాలు ఒక్కసారిగా ఆకాశం లోకి వలతో పాటుగా ఎగిరాయి.

దూరం నుంచి ఇది చూసిన వేటగాడు పావురాలే కాక , తన వల కూడా పోతోందని ఆత్రం గా వాటి వెంట కొంత దూరం పరిగెత్తి, అరిచి, కూలబడ్డాడు. చిత్రగ్రీవుడు తన గుంపు తో వలతో సహా తన స్నేహితుడైన హిరణ్యకుడు అనే ఎలుక ముందు వాలాడు. హిరణ్యకుడు భయంతో తన కలుగు లోకి దూరాడు.

వెంటనే, చిత్రగ్రీవుడు, “మిత్రమా! హిరణ్యా !మేమంతా ఒక వలలో చిక్కి, ప్రాణాపాయం లో ఉన్నాము. నువ్వే మమ్మల్ని రక్షించాలి. బైటకిరా,” అని పిలిచాడు. తన స్నేహితుడైన చిత్రగ్రీవుడిని చూసి సంతోషం తో బైటికి వొచ్చి, చిత్రగ్రీవుని బంధ విముక్తుణ్ణి చెయ్యడానికి వలని కొరకడంమొదలుపెట్టాడు.

అంత చిత్రగ్రీవుడు, “మిత్రమా ఆగు, ముందు నా పరివారాన్ని రక్షించు, తరువాత నన్ను బంధ విముక్తుణ్ణి చెయ్యచ్చు. ఎందువల్లనంటే, నువ్వు ఈ పని చేస్తూ చేస్తూ అలసి పోవచ్చు . రాజుగా నా కర్తవ్యం, ముందుగా నా పరివారాన్ని కాపాడటం,చివరగా నన్ను రక్షించుకోవటం,” అని అన్నాడు.

ఈ మాట వింటూనే హిరణ్యకుడు చాలా సంతోషించి, వెంటనే తన ఎలుకల సైన్యాన్ని పిలిచాడు. అవన్నీ చక చకా వలని తునాతునకలు చేసి, పావురాలని విడిపించాయి. చిత్రగ్రీవుడు తనని, తన పరివారాన్ని కాపాడినందుకు హిరణ్యకుడికి కృతఙ్ఞతలు తెలిపి, హాయిగా వెళ్ళిపోయాడు.

నీతి: ఈ పంచతంత్రం చిన్నకధలో స్నేహితుల వల్ల కలిగే లాభం, ఐకమత్యమే బలం అనే నీతి స్పష్టంగా తెలుస్తోంది.

3. సింహం, ఎలుక కధ

Lion, rat story

ఒక అడవిలో సింహం మధ్యాహ్నం హాయిగా నిద్రపోతోంది. ఆ ప్రాంతంలోని చిన్ని ఎలుక ఆడుతూ దాని దగ్గిరకొచ్చి, అది అంతపెద్ద జంతువని గ్రహించక, దాని మీసాలతో ఆడుతూ, దాని బొజ్జ మీద గెంతసాగింది.

సింహానికి నిద్ర చెడి, కోపం వొచ్చింది. “ఏయ్! ఎవరది? నేను నిద్ర పోతుంటే, నన్ను ఇంత విసిగిస్తోంది?” అని గట్టిగా గర్జించింది. పైగా ఎలుకని తనచేత్తో ఒడిసి పట్టుకుంది. ఆ బుజ్జి ఎలుక హడిలిపోయి, “నన్ను వొదిలిపెట్టు, నేను నీకు ఏదోఒక రోజు సహాయం చేస్తాను. మా అమ్మ నా కోసం చూస్తోంది,” అని బిక్క మొహం పెట్టింది. “హహహ ! ఇంత చిన్న జంతువూ నాకు సహాయమా?” అని నవ్వుతూ, “ఫో! ఇంకెప్పుడు నాముందు కుప్పిగెంతులు వెయ్యకు,” అని బుద్ధిచెప్పి వొదిలేసింది.

కొన్నాళ్ళకు ఆ సింహం ఒక వేటగాడి వలలో చిక్కి, సహాయం కోసం అరుస్తూ విలపించసాగింది. దానికి సహాయం చెయ్యడానికి ఎవ్వరూ ముందుకి రాలేదు. కానీ ఈ చిన్ని ఎలుకకి సింహం పై చాలా అభిమానం. “అయ్యో నా స్నేహితుడు, రాజు, సింహానికి సహాయపడాలని” హుటాహుటిన వొచ్చింది.

దానిని చూసి, “నువ్వా? ఇంత చిన్న దానివి నాకు ఎలా సహాయపడగలవు?” అంది సింహం. “నా పదునైన పళ్ళు తో ఈ వలని వేగంగా తుంపేస్తా! వెంటనే పరుగున మీరు తప్పించుకోవచ్చు,” అంటూనే చక చకా తన పని కానిచ్చింది. దాని సహాయానికి చాలా అబ్బురపడింది సింహం.

నీతి: చిన్న,పెద్ద తేడా లేకుండా, సహాయం చెయ్యాలి అనే గుణం ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది.

మిత్రభేదము (మిత్రుల మధ్య విబేధాలు)

4. కొంగ, ఎండ్రకాయ కధ

Crane, lobster story

ఒక సరస్సులో ఒక ముసలి కొంగ, చేపలు, కప్పలు, ఎండ్రకాయ ఉండేవి. ఎండాకాలం రాబోతున్న సమయంలో ఒకనాడు జిత్తులమారి కొంగ ఏడుపు మొహం పెట్టుకుని దిగాలుగా ఉంది. చేపలు, ఎండ్ర కాయ అన్నీ దాని చుట్టూతా చేరి, “ఎందుకు ఇంత విచారంగా ఉన్నావు?” అని ప్రశ్నించాయి.

“నాకు రాబోయే కాలం గురించి తెలుస్తోంది. వానలు రావు, ఉన్న నీళ్లు ఎండిపోయి, మనమందరం క్రమంగా కరువు కాటకాలతో చచ్చిపోతాం.” అంది. ఆ మాటకి అవి చాలా కంగారుపడి, “అయ్యో, అనుభవమున్న నువ్వే మాకు ఒక మంచి ఉపాయం చెప్పి మమ్మల్నందర్నీ రక్షించాలి.” అన్నాయి. అదే సమయమని, కొంగ ఇలా అన్నది, “నాకు తెలిసిన మంచి పెద్ద చెరువు ఒకటి ఉంది. నేను మీ అందర్నీ ఒక్కక్కళ్ళని అక్కడికి చేరుస్తా. అక్కడ అందరమూ హాయిగా కాలం గడపచ్చు” అంది. అమాయకంగా అన్ని జలచరాలు కొంగ తో వెళ్ళడానికి తయారయ్యాయి.

ఆ మాయలమారి ముసలి కొంగ రోజుకొక చేపని నోటకరుచుకుని, దూరం గా ఉన్న గుట్ట పైన వాలి, వాటిని తిని, ఎముకలన్నీ అక్కడే పడేసేది. ఒకనాడు ఒక ఎండ్రకాయ వంతు వొచ్చింది. దాన్నివీపు మీద ఎక్కించుకుని గుట్ట వైపు ఎగిరింది. వీపు మీది ఎండ్రకాయ గుట్ట పైన ఎముకలు చూసి, ఇన్నాళ్లు జరుగుతున్న మోసం గ్రహించి, కొంగని నిలదీసింది. కొంగ చేపల నన్నిటిని తానే తిన్నానని ఒప్పుకుని, గర్వంగా చూసింది. ఎండ్ర కాయ కోపం తో కొంగ మెడని కొరికి చంపేసింది .

నీతి: నిజానిజాలు తెలుసుకోకుండా తియ్యని, మోసపూరిత మాటలు వినడం ప్రమాదకరం.

5. కోతి తింగరి చేష్టలు

Monkey

ఒక ఊళ్ళో గుడిని నిర్మించే పనిమొదలైంది. చాలామంది చెక్కపని చేసే వడ్రంగులు పెద్ద పెద్ద చెట్ల మానుల్ని కొట్టి, దూలాలుగా స్తంభాలు గా మలుచుతున్నారు. వాళ్లంతా మధ్యాహ్నం పని ఆపి, భోజనం చెయ్యడానికోసం ఎక్కడ పనిముట్లు అక్కడే పడేసి వెళ్లిపోయారు. సరిగ్గా అప్పుడు ఆ పక్కనే ఉన్న తోటలొనించి గుంపులు గుంపులు గా కోతులు వొచ్చి చెక్కలపైనా, దుంగలపైనా గెంతుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి.

అక్కడ బోలెడన్ని ప్రమాదకరమైన ఆయుధాలున్నాయి. ఒక పెద్ద దుంగ ని రెండుగా చీల్చాలనే ఉద్దేశ్యంతో పెద్ద ఇనప మేకుని దుంగ మధ్యలో దింపి ఉంచారు. ఒక కోతి సరిగ్గా అదే దుంగ పైకి ఎక్కి అటూ ఇటూ గెంతి, హఠాత్తుగా ఆ మేకుని రెండు చేతులతో పట్టుకుని గట్టిగా లాగింది. దాని తోక ఆ చీలిక మధ్య ఇరుక్కుంది. కోతి ఎంత తిప్పలు పడినా తోక బైటికి రాలేదు. పాపం బాధతో విల విల లాడింది. చివరికి మరణించింది.

నీతి: మనది కానీ పనిలో తలదూర్చకూడదు.

6. గాడిద గానం

Donkey singing

ఒక ఊళ్ళో ఒక చాకలి వద్ద ఒక గాడిద ఉండేది. దానికి ఒక నక్క తో స్నేహం కుదిరింది. రాత్రిళ్ళు ఇద్దరూ పోయి ఆహారం కోసం వెతికే వారు. ఒకరోజు చక్కని దోస పాదులతో నిండిన తోటకి వెళ్లి పెద్ద పెద్ద దోసకాయల్ని కడుపునిండా తిని, పౌర్ణమి కనుక చల్లని వెన్నెల, చల్లని గాలి హాయిగా వీస్తూ ఉండగా, గాడిద నక్కతో, “మిత్రమా! నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నాకో తియ్యని పాట పాడాలని ఉంది.” అంది.

“అయ్యయ్యో ! అంత పని చేయకు మిత్రమా. నీ పాటకి నిద్రపోతున్న రైతులు లేచి వచ్చి మనని కొట్టి తరుముతారు,” అంది నక్క. కానీ గాడిద నక్క మాట పట్టించుకోకుండా, “ఎం? నేను చక్కగా పాడితే భరించలేవన్నమాట. నీకు అసూయా? ” అంది గాడిద .

“సరే నీఖర్మ , ముందు నన్ను పోనీ,” అంటూ వేగంగా పరుగు తీసింది నక్క. గాడిద గొప్పగా ,పెద్దగా ఓండ్ర పెడుతూ పాట మొదలుబెట్టింది. నక్క చెప్పినట్టే రైతులు లేచి వచ్చి, దుడ్డు కర్రతో గాడిద ని చావ బాదారు. ఆ దెబ్బల బాధ భరించ లేక గాడిద పరుగు తీసింది. ఆ పక్కనే పొదల్లో దాక్కుని చూస్తున్న నక్కని చూసి, “మిత్రమా ! నువ్వు ముందు చూపుతో చెప్పిన మాట వినక చావుదెబ్బలు తిన్నాను,” అంటూ బాధ పడింది.

నీతి: అనుభవజ్ఞులు, మన మంచి కోరి చెప్పే వారి సలహా వినటం మంచిది.

7. గొర్రెలు, నక్క కధ

Sheep, fox story

అనగనగా ఒక గ్రామం లో ఒక నక్క తిరుగుతుండగా, అక్కడ రెండు గొర్రెలు కొట్టుకోవటం చూసింది. వాటి యుద్ధం చూస్తూ కొంత మంది జనం చప్పట్లు కొడుతూ హుషారుగా ఆనందిస్తున్నారు. కొంత సేపటికి ,రెండు గొర్రెలకు నుదుటి మీద గాయాలయ్యి, రక్తం ధారగా కారసాగింది. పొంచి చూస్తున్న నక్కకి రక్తం ధార చూడగానే నోరూరింది.

పైన బడి, గొర్రె మాంసం తినెయ్యాలన్న కోరికతో, ఒక్కసారిగా, ముందు,వెనుక ఆలోచించక, వాటి మధ్యకి దూకింది. గొర్రెలు రెండూ మంచి బలమైనవి. అవి దూరంగా వెళ్లి ఢీ కొట్టడానికి పరుగు పరుగున లంఘించాయి. సరిగ్గా అదే సమయానికి నక్క వాటి మధ్య చేరి, వాటి దెబ్బకి మధ్యలో పడి చచ్చిపోయింది.

నీతి: బాగా అలోచించి గాని అడుగు ముందుకి వెయ్యరాదు, తొందరపాటు ప్రమాదకరం.

8. పులి, కొంగ (శతృవు తో స్నేహం)

Tiger, konga (friendship with the enemy)

ఒక అడవిలో పులి వేటాడుతూ హాయిగా కాలం గడుపుతుండేది. దాని స్థావరానికి కొంచం దూరంలో ఒక పెద్ద చెట్టు పైన కొంగ నివసిస్తుండేది. జన్మతః శత్రువులైన అవి ఏనాడూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. కానీ ఒక రోజు పులి ఏదో జంతువుని తింటుంటే, ఆ జంతువుఎముక పళ్లల్లో ఇరుక్కుని, బైటకి రాక, చాలా ఇబ్బంది పడి, నొప్పితో గట్టిగా అరుస్తూ బాధపడుతోంది.

చివరికి అలిసిపోయి, మూలుగుతూ పడున్న పులి దగ్గరికి సందేహంగా వొచ్చింది కొంగ. “ఏమైంది? ఏమిటి నీ బాధ? నేనేమైనా సహాయం చెయ్యగలనా?” అని అడిగింది. పులి తన సమస్య ని చెప్పింది. “నీ పొడవైన ముక్కు తో నా పళ్ళ మధ్య ఉన్న ఎముకని తీయగలిగితే, నేను ఈ బాధనించి బైటపడతాను,” అంది.

“తప్పకుండా ! ఏది నోరు తెరిచి చూపించు ,” అని తన పొడవైన ముక్కు తో ఇరుక్కుని బాధ పెడుతున్న ఎముక ముక్కని లాగి సహాయం చేసింది కొంగ. “ఆహా! నువ్వు చేసిన సాయం చాలా పెద్దది. ఈ రోజునుంచి మనం స్నేహితులం.” అంటూ చాలా తియ్యగా మాట్లాడింది. అమాయకమైన కొంగ దాన్ని నమ్మింది. ఇద్దరు చాలా కాలం మాట్లాడుకుంటూ, పులి తెచ్చిన వేటని అప్పుడప్పుడు తింటూ కాలం గడిపేవారు.

కానీ, కొన్ని రోజులకి పులికి అస్సలు వేట దొరకక, ఆకలి బాధతో విలవిల్లాడింది. దాని ఆకలి బాధ ముందు విచక్షణ,స్నేహ బంధం కూడా నిలబడలేదు. కొంగని ఎదురుగా చూస్తుంటే, దాన్ని తిని, ఆకలి తీర్చుకుంటే తప్పు లేదనిపించింది. మళ్ళీ నోటిలో ఏదో ఇరుక్కున్నట్టు నటించింది. కొంగ సరేనని సహాయం చెయ్యడానికి పులి ని నోరు తెరవమని, లోపలికి చూస్తూ ఉండగా, గబుక్కున కొరికి, దాన్ని చంపేసింది.

నీతి: శతృవు తో స్నేహం మహా ప్రమాదకరం.

9. ముగ్గురు మూర్ఖులు

ముగ్గురు మూర్ఖులు 

ఒకపండితుడి దగ్గర విద్య నేర్చుకొని, బ్రతుకు తెరువు కోసం నగరానికి బయలుదేరారు ముగ్గురు శిష్యులు. వాళ్ళతో పాటు చదువు రాని ఒక పనివాడు కూడా ఉన్నాడు. వాళ్ళు అడవిలో ప్రయాణిస్తుండగా ఒక ఎండిపోయిన సింహం కళేబరాన్ని చూశారు.

ఆ ముగ్గురు శిష్యుల్లో ఒకడు, “ఆహా! మన తెలివితేటలూ, విద్యని ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది. ఈ ఎముకలన్నిటిని సింహంశరీరంలో ఎలా ఉంటాయో ఆలా అమర్చగలను,” అన్నాడు. మరో శిష్యుడు, “నేను నా మంత్ర శక్తితో మాంసం, రక్తం, చర్మం, అన్నీసమకూర్చగలను,” అన్నాడుగర్వంగా. మూడో శిష్యుడు, “చూస్తూ ఉండండి, నామంత్రశక్తి తోసింహానికి ప్రాణం పోయగలను,” అన్నాడు.

చదువు రాని సేవకుడు, “అయ్యా! అది కౄర జంతువు. దానికి ప్రాణంవస్తే మనల్ని చంపేస్తుందయ్యా! వద్దయ్యా,” అంటూ బ్రతిమిలాడసాగాడు. వాళ్ళు ముగ్గురూ వీణ్ణి చూసి, “ఓరి పిరికివాడా” అంటూ నవ్వ సాగారు. దాంతో ఆ సేవకుడు గబ గబా దగ్గర్లో ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు భయం భయంగా.

విద్యావంతులైన ఆ ముగ్గురూ గబగబా వాళ్లకు చేతనైన విద్యని ప్రదర్శించి ఆ సింహానికి ప్రాణం కూడా పోశారు. సజీవమైన ఆ సింహం ఊరుకుంటుందా? పంజా బలంగా విసిరి, ముగ్గరి నీ చంపేసి అడవిలోకి పారి పోయింది .చెట్టెక్కిన సేవకుడు, చదువు రాక పోయినా, ప్రాణాలతో బైట పడ్డాడు. ముగ్గురూ చని పోయారని విచారిస్తూ వెనక్కి వెళ్ళిపోయాడు.

నీతి: చేసే పని పర్యవసానం ఏమిటో సరిగ్గా ఆలోచించ కుండా ఏ పనీ చేయరాదు.

10. మెదడు లేని గాడిద

Brain-free donkey

ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది కాలక్రమేణా వయసు పైబడి ముసలిదై,వేటాడే శక్తి కూడా లేనిదై, రోజు ఆహారం ఎలా సంపాదించాలా అనే ఆలోచనలో పడింది. బాగా ఆలోచించి ఒక నక్కని పిలిచి, “నీ తెలివి తేటలు,చురుకుదనం గురించి చాలా విన్నాను. నువ్వు నా ప్రధాన మంత్రిగా ఉండు. నాకు రోజూ ఆహారం సంపాదించే పని నీకే ఇస్తున్నాను,” అంది. అది విన్న నక్క, “చిత్తం మహారాజా! తప్పకుండా! ఈ రోజూనుంచి మీకు ఆహారం తెచ్చే పనినాదే,” అంటూ పొంగి పోయింది.

అదే పనిమీద నక్కఅడవిలోకొంత దూరం వచ్చి అక్కడ గడ్డి మేస్తున్న ఒక బలిసిన గాడిదనిచూసి “నిన్ను మన వనరాజు సింహం పిలుస్తోంది. నిన్ను తన మంత్రిగా నియమిస్తుందట,” అని చెప్పింది. గాడిద ఆశ్చర్యంగా, “నన్నా? ఎందుకు?” అని అడిగింది. “నువ్వు కష్టపడి బాగా పనిచేస్తావు గదా, మంత్రిగానువ్వే ఉండాలిట. ముందు త్వరగారా” అందినక్క.

గాడిద “సరే” అంటూ, నక్క వెంట వెళ్ళింది. గాడిద రావటం తోటే సింహం దానిపైకి ఎగబడింది. గాడిద బెదిరి పోయి పరుగు లంకించు కుంది. వెంటనే నక్క”స్వామి! మీరు దాన్నిభయపెట్టేశారు, మళ్ళీ ప్రయత్నించి , ఎలాగోలా తీసుకు వస్తా,” అని చెప్పి,ఎలాగో దాన్ని ఒప్పించి మళ్ళీ గాడిదని సింహం దగ్గరికి తీసుకువచ్చింది .

ఈ సారి సింహం గాడిదని చంపేసింది. నక్క మహా జిత్తుల మారి. పైగా మంచి ఆకలి మీద ఉంది. సింహంతో నక్కఇలా అంది, “రాజా ! నేను దీనికి కాపలాగా ఉంటాను. మీరు ముందువెళ్లి శుభ్రంగా స్నానం చేసి రండి , తరవాత హాయిగా తినవచ్చు.” సింహం సరే నని శుభ్రంగా స్నానంచేసి నీళ్లు త్రాగి వచ్చేసరికి నక్క గాడిద తలలోని మెదడుని తినేసింది.

సింహం వస్తూనే, “నాఆహారాన్ని ఎవరు తిన్నారు? దాని మెదడేదీ?” అంటూ గట్టిగా గాండ్రించింది. నక్కతెలివిగా, “రాజా! గాడిదకు మెదడేదీ? మెదడే ఉంటే, ఆలోచించి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేదా ?” అంది. దానితో సింహం “అంతే గదా” అనుకుంటూ ఆకలితీర్చుకో సాగింది.

నీతి: ఎల్లప్పుడూ దుష్టులకి దూరంగా ఉండాలి.

అపరిక్షితకరకం (అనాలోచితం గా చేసేపనులు)

11. కుక్క, గాడిద కథ

Dog, donkey story

అనగనగా కాశీనగరం లో ఒక చాకలివాడు ఉండేవాడు. ఒకరోజు చాలా బట్టలు ఉతికి అలిసిపోయి ఒళ్ళు మరచి నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి అయింది. అదే అదనుగా ఓ దొంగ ఇంటిలోకి చొరబడ్డాడు. దొంగ ఇంట్లోకి చొరబడటం ఆ ఇంటిలోని గాడిద, కుక్కా రెండూ చూశాయి.

కట్టి ఉండడం వల్ల గాడిద దొంగను అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయింది. కుక్క కట్టిలేదు అది ప్రయత్నించవచ్చు. అయితే అది ఆ ధ్యాసలో లేదు. ఆ విషయాన్నే కుక్కని అడిగింది గాడిద, “ఏంటలా చూస్తూ కుర్చున్నావ్?దొంగని చూసావు కదా! మొరుగు. యజమానిని లేపు.”

“నేనేం చెయ్యాలో నాకు బాగా తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. యజమాని నష్ట పొతే పోనీ,” అంది కుక్క. దానికి యజమాని అంటే చాలా కోపంగా ఉంది. “రోజంతా ఇంటి ని కనిపెట్టుకుని ఉన్నందుకు కనీసం పట్టెడు అన్నమైనా పెడతాడు ఎవడైనా. మన యజమాని ఉన్నాడు ఇంత అన్నం పెట్టిన పాపానికైనా పోలేదు. ఇలాంటివాడిని లేపమంటావు నువ్వు. నేను చచ్చినా లేపను గాక లేపను. అస్సలు అరవను,” అంది కుక్క.

“అతని అవసరానికి ఉపయోగపడని మనం ఎందుకు? కృతఘ్నత మహా పాపం,” అంది గాడిద. “చాల్లే చెప్పొచ్చావ్” అన్నట్టుగా కుక్క మొహం అటు తిప్పేసుకుంది. “నువ్వు అరవనంత మాత్రాన పెద్ద కొంపలేం మునిగిపోవు. నేను అరుస్తాను,యజమానిని నిద్ర లేపుతాను,” అంటూ గాడిద పెద్దగా ఓండ్ర పెట్టటం మొదలు పెట్టింది. దొంగ భయపడ్డాడు. దొరికిందాన్తో ఉడాయించాడు. అది గమనించని గాడిద ఓండ్ర పెడుతూనే ఉంది.

చాకలివాడికి మెలకువ వచ్చింది. గాడిద అరుపుకి చికాకు పడిన చాకలివాడు దుడ్డుకర్ర తీసుకుని గాడిదని చావబాదారు.

నీతి: ఎవరి పని వారే చేయాలి. ఒకరి పని ఇంకొకరు చేస్తే లాభము లేకపోగా ప్రాణానికే ముప్పు వచ్ఛే ప్రమాదం రావచ్చు.

12. నమ్మకమైన ముంగిసకథ

Reliable Mind

ఒక ఊళ్ళో ఒక రైతు కుటుంబం ఉండేది. వాళ్లకో బుజ్జిపాపాయి ఉండేది.వాళ్ళఇంట్లో పెంపుడు జంతువుగా ఒకముంగిస కూడా ఉండేది.అది యజమానంటే చాల విశ్వాసంగా ఉండేది. రైతు కూడా ముంగిసని ప్రేమగా చూసుకునే వాడు.

ఒకరోజు రైతుపొలంలో పని చేసుకుంటుంన్నాడు. రైతు భార్య సరుకుల కోసం బయటికి వెళ్లాల్సి వచ్చింది. పాపాయికి పాలు పట్టి, ఉయ్యాల్లో పడుకోబెట్టి నిద్రబుచ్చింది. ముంగిసని పాపాయికి కాపలాగా పెట్టి పనిమీద బజారు కిబయల్దేరింది.

ఇంతలో ఒక త్రాచు పాము ఊయ్యాల లోని పాప వైపు రావటం చూసి, ముంగిస అమాంతం దాని మీద దూకి, నోటితో కొరికి చంపి, గుమ్మంలో యజమానురాలి కోసం, ఆత్రం గా ఎదురుచూస్తూ ఉంది.

త్వరగా పనిముగించుకొని ఆమె తిరిగి ఇంటికి వచ్చే సరికి వాకిటిగుమ్మం దగ్గర ముంగిస ఆత్రంగా ఎదురు చూస్తూ కనిపించింది. ముంగిస నోటికిఉన్న రక్తం చూస్తూనే నిర్ఘాంత పోయింది రైతుభార్య. భయంతో వణికి పోయింది. సరకుల సంచి కింద పడేసి, “నా బిడ్డని చంపేశావా” అని అరుస్తూ, ఏడుస్తూ పక్కనే పడి ఉన్నపెద్ద రాయిని ముంగిస మీద బలంగా విసిరి చంపేసింది. ఏడుస్తూ ఇంటి లోకి పరిగెత్తుకు వెళ్లి అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్య పోయింది. పాపఉయ్యాల దగ్గర ఒకత్రాచు పాము చచ్చి పడి ఉంది. దాని రక్తమే ముంగిస నోటికి ఉందని గ్రహించినరైతు భార్య, ఉయ్యాల్లోపాపాయిహాయిగా ఆడుకోవటం చూసి “అయ్యో! నా పాప ని పాము నుంచిరక్షించి న ముంగిస నితొందరపడి చేతులారా చంపేశానే ,” అని విచారంతో కూలబడి పోయింది.

నీతి: తొందర పాటు చాల ప్రమాదకరం.

13. నలుగురు నిధి వేట గాళ్ళు

Four treasure hunting rods

నలుగురు బీదవారు డబ్బు సంపాదించుకొనే కోరిక తో నగరానికి బయలు దేరారు.దారిలో ఒక శివాలయం కనిపించింది. అక్కడొక మహాను భావుడైన యోగి ఉన్నాడు. ఆ నలుగురు, “స్వామి! మేము ధనం సంపాదించాలనే ఆశయం తో నగరానికి బయలు దేరాం. ఏదైనా తరుణోపాయం చెప్పండి ” అని విన్నవించారు. “ఇదిగో, ఈ నాలుగు పత్తితో చేసిన ఒత్తులు ,మీ నలుగురూ తలొకటీ పట్టుకుని నడవండి . ఎవరి చేతిలో వత్తిఎక్కడ పడితే, అక్కడ తవ్వండి ! మీ మీ భాగ్యాన్ని పరీక్షించుకోండి,” అని దీవించాడు. ఆ నలుగురు ఉత్సాహంగా తమ చేతిలో వొత్తితో బయలుదేరారు.

కొంత దూరం వెళ్ళాక, ఒకడి చేతిలో వత్తి కింద పడింది. వెంటనే అక్కడ తవ్వగా, వాళ్లకి బోలెడన్ని రాగి నాణాలు దొరికాయి. “అందరం హాయిగా వీటిని పంచుకుని సంతృప్తి గా ఉందాం రండి,” అన్నాడు కానీ మిగతా ముగ్గురూ, ముందు కెళ్ళి మా అదృష్టం పరీక్షించుకుంటామని వెళ్ళారు. రెండవ వాడి వత్తి జారిపడిన చోట తవ్వగా, వాళ్లకి వెండి నాణాలు దొరికాయి. “ఇక హాయిగా ఈ ధనం తో బ్రతుకుదాం, ఇంక ముందుకి వెళ్ళటం ఎందుకు? ” అంటున్నా వినక, మిగతా ఇద్దరూ ముందుకి వెళ్ళారు.

మూడవ వాడి వత్తి కూడా పడింది. అక్కడ తవ్వగా, బంగారు నాణాలు దొరికాయి. చాలా సంతోషించి, “ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం. ఇవి చాలు, మన జీవితాలు హాయిగా గడవడానికి” అన్నాడు.” కాదు ఇంకా ముందుకి వెళితే, విలువైన రత్నాలు, వజ్రాలు, దొరుకుతాయని మహా ఆశ పడ్డాడు నాలుగో వాడు. వాడొక్కడే చాలా దూరం నడిచి, నడిచి, కాళ్ళు నొప్పులు పుట్టగా, విపరీతమైన దప్పిక తో బాధ పడుతూ ముందుకి సాగాడు. అక్కడ ఒక వ్యక్తి ని చూసాడు. వాడి మెడ చుట్టూ ఒక చెక్క చట్రం బిగించబడి ఉంది. ఏదో శిక్ష అనుభవిస్తున్నట్టుగా ఉన్నాడు.

“నాయనా ! నాకు నీళ్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలవా? నీకు పుణ్యం ఉంటుంది.” అనగానే,ఆ చెక్క చట్రం వీడి మెడకి వఛ్చి చుట్టుకుంది. “ఇదేమిటి?ఈ చట్రం నాకు ఎందుకు చుట్టుకుంది? ఎలా పోగొట్టుకోవాలి? ” అన్నాడు విచారంగా . అప్పుడా వ్యక్తి, ఇలా అన్నాడు, “నేనీ శిక్ష ఎప్పటినించో అనుభవిస్తున్నా.నీ లాగా అత్యాశ తో మరొకడు వొస్తే గానీ నీకు విముక్తి లేదు . నీకు నాలాగే దురాశ ఎక్కువ. రాగి, వెండి, బంగారం చూసి తృప్తి లేక ,అత్యాశ తో ముందుకి వొచ్చి,అపాయం లో ఇరుక్కున్నావు .”

నీతి: దురాశ దుఃఖానికి చేటు అన్న.

14. నీలి నక్క కధ

Blue fox story

ఒక నక్క ఆహారం కోసం వెతుక్కుంటూ దగ్గర్లోని గ్రామం చేరింది. దాన్ని కొందరు గ్రామస్తులు చూస్తూనే తరుముకుంటూ వెంటపడ్డారు. అది పరుగెడుటూ ఒకరింట్లో బట్టలకి నీలిరంగు వేసే తొట్టె ఒకటి కనిపిస్తే, గబుక్కుని అందులో దాక్కుంది. దాని వొంటి నిండా నీలి రంగు అంటుకుని , అదొక విచిత్రమైన జంతువుగా కనిపిస్తోంది.

తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది కానీ, దాని వింత రంగు చూసి ఎదో ఒక విచిత్రమైన జంతువు కొత్తగా అడవిలోకి వొచ్చిందని చూసిన జంతువులన్నీ భయపడసాగాయి. పులి, సింహం, ఏనుగు, ఇంకా చిన్న, పెద్ద జంతువులన్నీ భయంతో పారిపోసాగాయి.

ఇదేమి జంతువో, ఎంత బలశాలో అన్నది తెలియందే ముందుకి వెళ్లరాదని అనుకున్నాయి. ఈ లోగా నక్క, “ఓ జంతుజాలమా! ఎందుకు నన్ను చూసి భయపడుతున్నారు? ఆ దేముడు నన్ను మిమ్మల్నందర్నీ పరిపాలించమని సృష్టించాడు .నేను మీకు రక్షకుడిని ,రండి,” అంటూ లేనిపోని నాయకత్వాన్నీ చూపించింది. పులి, సింహం కూడా తాను వేటాడిన జంతువుని ఈ కొత్త రాజు ముందు తెచ్చేవి, తన వాటా తిన్నాక , తీసుకెళ్ళేవి.

కానీ ఒకరోజు ఒక తమాషా జరిగినది. ఒక అర్ధ రాత్రి నక్కలన్నీ గుంపుగా చేరి, ఊళలెయ్యటం మొదలెట్టాయి. ఆ అరుపులు విన్న నీలి రంగు నక్క, ఉత్సాహంగా, వాటికి జవాబుగా గట్టిగా గొంతెత్తి ఊళ వేసింది. అది దాని సహజ లక్షణం కదా మరి? వెంటనే అందరికీ దీని మోసం తెలిసిపోయింది.

ఇది కేవలం ఒక నక్కేకాని దేముడు పంపిన గొప్ప జీవి ఏమీ కాదు అన్న నిజం తెలియగానే, ఒక్కసారిగా దాని పైకి జంతువులన్నీ లంఘించి కొట్టి చంపేశాయి.

నీతి: స్వజాతిగుంపు లోంచి విడిపోతే, నాశనం తప్పదు.

15. బీద బాహ్మణుని కల

Poor Brahmin dream

స్వాభావిక అనేఒక బీద బాహ్మణుడు గ్రామంలో బిక్షాటన చేసుకుని తను సంపాదించిన ఆహారం మిగిలితే, ఉట్టి పై పెట్టి, కిందే మంచం వేసుకుని పడుకునేవాడు కాపలాగా. ఒక రోజు అనుకోకుండా, వాడికి చాలా పాయసం దొరికింది. దాన్ని కుండలో పెట్టి ఉట్టిమీద దాచి, దాని కిందే మంచం మీద పడుకున్నాడు.

వాడికి నిద్రపట్టి ఒక కల వొచ్చింది. అందులో వాడు ఆ పాయసాన్ని కొన్ని వెండి నాణాలకి ఎవరికో అమ్మి, ఆ సొమ్ముతో రెండు మేకల్ని కొన్నట్టు, వాటికి పిల్లలుపుట్టి, వాటిని అమ్మి, క్రమంగా వ్యాపారం చేస్తూ, కొన్ని ఆవులు కొని పాల వ్యాపారం చేసి, గొప్ప ధనవంతుడైనట్టు, ఆ డబ్బుతో మంచి ఇల్లు, గుర్రాలు కొని, ఎంతో ధనికుడిగా పేరు మోసిన్నట్టు, పక్క గ్రామంలో మరో బ్రాహ్మడు తన కూతురునిచ్చి పెళ్లి చేసినట్టు, వాళ్లకి కొడుకు పుట్టినట్టు, వాడు మహా అల్లరి వాడై గట్టిగా అరుస్తున్నట్టు, వాళ్లమ్మ వాడిని పట్టించుకోనట్టు, తను పట్టరాని కోపంతో కాలెత్తి తన్ని నట్టు కల వొచ్చింది.

కల లో తంతున్నా ననుకుని నిజం గానే కాలెత్తి గాలిలో తన్నాడు. కాలు పైనున్న కుండ కి తగిలి అందులోని పాయసం కిందపడి , చెల్లాచెదురైంది. మెలుకువ వొచ్చి , చూసి చాలా విచారించాడు.

నీతి: గాలిలో మేడలు కట్టడం అనర్థదాయకం.

16. రాజు, సేవకుడైన కోతి కధ

Rāju, sēvakuḍaina kōti kadha

ఒక రాజుగారు పెంపుడు జంతువుగా ఒక కోతిని రాజభవనం లో పెంచుకున్నారు. అది రాజభవనమంతా ఠీవిగా తిరిగి, చేతికందిన ఆహారం తింటూ, రాజుని మాత్రం జాగ్రత్తగా చూసుకునేది. వేసవి కాలంలో వేడిగా ఉన్నరోజు, మధ్యాహ్నం భోజనం చేసి, రాజు హాయిగా నిద్ర పోతున్నాడు. పక్కనే కోతి పెద్ద విసనకర్రతో విసురుతోంది.

ఒక ఈగ రాజుగారి ఛాతీమీద మాటిమాటికీ వాలుతోంది. అది గమనించిన కోతి చాలాసార్లు దానిని నెమ్మదిగా అదిలించింది. ఈగ పోయినట్టే పోయి మళ్ళీ మళ్ళీ అదే చోట వొచ్చి వెళుతోంది. కోతికి భలే చిర్రెత్తుకొచ్చింది. కోతికి ముందు చూపు, ఆలోచన ఏముంటుంది? వెంటనే ఆ ఈగ పనిపట్టాలనుకుంది.

ఒక పెద్ద కత్తి తీసుకొచ్చి, గురి చూసి ఈగని చంపాలని రాజుగారి గుండెపైన గట్టిగా వేటు వేసింది. రాజుగారు ఆ దెబ్బకి వెంటనే మరణించారు.

నీతి: ఒక మూర్ఖుడు మీకు ఎప్పుడు ఉపయోగ పడలేడు.

లబ్ద ప్రణాసం (సంధి, నష్టం లేకుండా) కధలు

17. కుందేళ్ళు, ఏనుగులు

Rabbits, elephants

ఒక సంవత్సరం, వానలు లేక అడవిలో ఏనుగులకి తాగేనీరు కరువై చాలా ఇబ్బంది వచ్చింది. నీటి కై వెతుక్కుంటూ ఒక సరస్సు చూసి, ఏనుగులు పరుగుపరుగున వెళ్ళి, నీళ్లు త్రాగటమే కాదు హాయిగా స్నానాలు చేశాయి. ఏనుగులు పరుగున రావడం తో చెరువు ఒడ్డున నేలలో ఇళ్ళు కట్టుకుని నివసిస్తున్న కుందేళ్ళు భయపడి పరుగు లంకించు కున్నాయి.

ఆ పరుగులాటలో కుందేళ్ళు ఏనుగుల కాళ్ళ కింద పడి కొన్ని నలిగిపోతే, కొన్నిచచ్చిపోయాయి పాపం. చచ్చిపోయిన కుందేళ్ళని చూసి మంత్రి కుందేలు, రాజు కుందేలుని కలిసి “అనుకోని ఆపద వచ్చి పడింది , మహారాజా !మన చెరువు మీదికి ఏనుగులు దాడి చేశాయి. బలమైన ఏనుగులు అడ్డు,ఆపు లేకుండా , మన కుందేళ్ళని ఇష్టం వొచ్చినట్టు తొక్కుకుంటూ నీళ్లకోసం పోతున్నాయి. ఏదైనా మంచి ఉపాయం తో వాటిని ఇక్కడినించి తరిమి కొట్టాలి ,” అంది.

బలవంతులైన ఏనుగుల్ని బలహీనమైన కుందేళ్లు ఎదురుకోవాలంటే, ఇక్కడ బలం తో కాదు బుధ్ధిబలం తోనే ఎదురుకోవాలి. మంత్రి కుందేలు తెలివికి పదును పెట్టి సరిగ్గా ఏనుగులు చెరువు దగ్గరకి వొచ్చే సమయానికి అక్కడ ఒక రాయి పైన నిలబడి, గట్టిగా ఇలా అంది . “ఓయ్ ఏనుగు రాజా! నీకో చిన్న మాట!” ఏనుగు ఆగి, “నువ్వెవరు నాకు చెప్పడానికి?” అంది.

“నేను మామూలు కుందేలు ని కాను. ఆకాశంలో చంద్రుడు తెలుసు కదా? ఆ చంద్రుడిలో కొలువుండే కుందేలుని. మా రాజు ఆ చంద్రుడే. ఆ రాజదూత గా చెపుతున్నా వినండి . ఈ చెరువు మా సామ్రాజ్యం లో ఉంది. ఈ చెరువులో నీళ్లు తాగాలన్నా , అందులో స్నానం చెయ్యాలన్న మా రాజుగారి అనుమతి మీరు తీసుకోవాలి . తీసుకోలేదు. పైగా, ఎప్పుడుపడితే అప్పుడు వొచ్చి నీరు తాగుతూ, స్నానం చేస్తూ,దారిలోని మా కుందేళ్ళని తొక్కి చంపేస్తున్నారు . అది తప్పు . మీరు ఇప్పటివరకు చేసినదంతా మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నాము. ఇకపై ఇటు వొచ్చారంటే, మా రాజు మిమ్మల్ని వొదలడు.చంద్రుడు మీపై చాలా కోపంగా ఉన్నాడు .”

ఆ మాటలకి ఏనుగులు భయపడి పోయాయి. “మా రాజు చంద్రుడు,ఇక్కడికి చీకటిపడుతుండగా వొస్తాడు . మీ లో మంత్రి వొచ్చి ,స్వయంగా క్షమార్పణ అడిగితే, సరిపోతుంది,” అంది కుందేలు. అవి సరే అని వెళ్ళిపోయి, ఆ రోజు చీకటి పడుతుండగా మంత్రి ఏనుగు అక్కడికి వొచింది. అప్పటికి చంద్రుడు ఎర్రగా ఉన్నాడు. చెరువు నీళ్ళల్లో చంద్రుడి ప్రతిబింబం చూపించి, “మా రాజు ముఖం ఎర్రగా ఉంది . ఆంటే కోపం గానే ఉన్నాడు. ఇలాంటప్పుడు పలకరించడం ప్రమాదం. చంపేసినా చంపేస్తాడు. ఎందుకొచ్చిన గొడవ? నేను ఆయనతో జాగ్రత్తగా మాట్లాడి, మిమ్మల్ని క్షమించమని అడుగుతాను. దూరం నించే ఒక నమస్కారం చేసి, వెళ్లిపోండి. మళ్ళీ ఇటు వైపు రాకండి.” అంది. నీటిలోని చెంద్రుడికి ఒక నమస్కారం చేసి , “మళ్ళీ ఇటు రాము” అని చెప్పి వెళ్ళిపోయింది ఏనుగు .

నీతి: దేహ బలం లేకపోయినా బుద్ది బలం తో గెలవవచ్చ.

18. దెబ్బకి దెబ్బ కధ

Debbaki debba kadha

ఒక గ్రామం లో ఇద్దరు వర్తకులు సుబుద్ధి, కుబుద్ధి స్నేహం గా ఉండేవారు. సుబుద్ధి కి ఆ సంవత్సరం నష్టాలు వొచ్చాయి. తన స్నేహితుడు కుబుద్ధి వద్దకి వొచ్చి, “నేను ఒక సంవత్సరం విదేశాలకి పోయి, వ్యాపారం చేసి వద్దా మనుకుంటున్నాను. నా దగ్గరున్న ఇనుము నీ దుకాణం వెనుక పెట్టి ఉంచుకోవా? మళ్ళీ వొచ్చాక తీసుకుంటాను,” అన్నాడు. కుబుద్ధి ఒప్పుకున్నాడు. కానీ ఆ సంవత్సరం ఇనుముకి చాలా ధర పలికింది. కుబుద్ధి తన సరుకు తో పాటు, సుబుద్ధి సరుకుని కూడా అమ్మేశాడు.

ఒక సంవత్సరం గడిచాక, సుబుద్ధి తిరిగి వొచ్చాడు. నా సరుకు ఎక్కడా అని అడిగాడు. అత్యాశ తో కుబుద్ధి, “నీ ఇనుమునంతా ఎలుకలు తినేసాయి,” అని అబద్దం చెప్పాడు. సుబుద్ధి, కుబుద్ధి మోసం గ్రహించాడు. తగిన గుణ పాఠం చెప్పాలనుకున్నాడు.

ఒక వారం రోజులయ్యాక, తన కొడుకు పుట్టినరోజు వేడుకకి కుబుద్ధి కొడుకుని పంపమని కోరాడు సుబుద్ధి. సరేనని తన కొడుకుని పంపించాడు. సుబుద్ధి ఆ పిల్లాడిని ఎక్కడో దాచేసాడు. ఆలస్యం మవుతోందని, ఖంగారు పడుతూ తన కొడుకుని వెతుక్కుంటూ వొచ్చాడు కుబుద్ధి. “అయ్యో! నీ పిల్ల వాడిని పంపించాను . కానీ దారిలో ఒక గద్ద వాడిని ఎత్తుకు పోయిందని ” అన్నాడు సుబుద్ధి.”

“కాదు ఇది మోసం, అబద్దం,” అంటూ వెంటనే రాజు వద్దకి న్యాయం కోసం వెళ్లారు. “పిల్లాడిని ఎక్కడ దాచావు? ఎక్కడైనా గద్ద పిల్లాడిని ఎత్తుకెళ్తుందా? ” అంటూ రాజు గారు సుబుద్ధి ని నిలదీశారు. “రాజా! నా ఇనుముని ఎలుకలు తినేశాయంటే నేను నమ్మలేదూ? అలాగే ఇది కూడా,” అన్నాడు సుబుద్ధి. రాజుగారు కుబుద్ధి చేసిన అన్యాయం తెలుసుకుని, దండించి, ఆ సొమ్ము ఇప్పించాక, పిల్లాడిని తండ్రి కి అప్పచెప్పాడు సుబుద్ధి.

నీతి: ఎత్తులు వేసే వాళ్లున్నప్పుడు,ఫై ఎత్తువేసేవాళ్ళు కూడా ఉంటారు.

19. తెలివి గల కుందేలు, సింహం కధ

Clever rabbit, lion story

ఒక అడవిలో బలమైన సింహం మృగరాజు ఉండేది. దాని ఇష్టం వొచ్చినట్టు వేటాడుతూ జంతువుల్ని తినసాగింది. ఆకలి తో సంబంధం లేకుండా వినోదానికి కూడా వేటాడి, జంతువుల్ని పెద్ద ఎత్తున తినేస్తోంది. జంతువులు ఇది భరించలేక వాటిలో అవే బాగా చర్చించుకుని, అవన్నీ కలిసి కట్టుగా వొచ్చి సింహాన్ని కలిసాయి. “ఏమిటి మూకుమ్మడిగా వొచ్చారు?” గర్జించింది సింహం.

“ఏమీ లేదు మహారాజా ! మీతో ఒక విషయం విన్నవించుకుందామని వచ్చాము. మా సంగతి మీకు తెలిసిందే కదా, మీకు ఎప్పటికైనా ఆహారం కావాల్సిన వాళ్ళం. మీ వేట ప్రతినిత్యం మమ్మల్ని భయభ్రాంతుల్ని చేస్తోంది. అందుకని, మేము ఒక నిర్ణయానికి వొచ్చాము. రోజుకొకరుగా మాలో మే మే మీ ముందుకి వొస్తాము. మీరు వేటాడక్కర్లేదు. ఒక్కరిని తిని తృప్తిపడండి. అనవసరంగా ఎక్కువ జంతువుల్ని చంపకుండా.”

ఏమనుకుందో గానీ, సింహం ఈ ఒప్పందానికి సరేనంది. “కానీ ఎప్పుడైనా జంతువుని పంపించక పొతే, నేను మీ అందరిని చంపేస్తాను !” అని బెదిరించింది.

ఒకరోజు కుందేలు వొంతు వొచ్చింది. కుందేలు వలవల ఏడ్చింది. ఎలాగైనా చావు తప్పదు, తెలివిగా ఆలోచించి ఈ ప్రమాదం అందరికీ తప్పిస్తే ఎంత బాగుంటుంది, అని ఆలోచిస్తూ నెమ్మదిగా నడక మొదలెట్టింది. అనుకోకుండా కుందేలు ఒక బావి లోకి తొంగి చూసింది. దాని ప్రతిబింబం నీటిలో కనిపించింది. దాన్ని చూస్తుండగా ఒక మంచి ఉపాయం తట్టింది.

కావాలని అక్కడా ఇక్కడా కూర్చుంటూ, ఆలస్యంగా సింహం గుహని చేరింది. అప్పటికే ఆకలితో నక నక లాడుతున్న సింహం కోపంగా, “నువ్వా? నా ఆకలికి నువ్వేమి సరిపోతావ్? పైగా ఇంత ఆలశ్యమా?” అంటూ గర్జించింది. “రాజా! నాతప్పేమీ లేదు ఇందులో. మీ ఆహారంగా నాలుగు కుందేలని పంపించారు మా వాళ్ళు కానీ దారిలో మరో సింహం ఎదురుపడి ,నేనే ఈ అడవికి మృగరాజుని . మరొకళ్ళు ఉండడానికి వీలు లేదని గట్టిగా అదిలించింది. ఎలాగో నేను తప్పించుకుని , మీ దగ్గరికి వొచ్చాను.”

అసలే ఆకలితో మండిపోతున్న సింహం గర్జిస్తూ, “ఈ వనంలో నాకు పోటీయా? ఎవరది? ముందు వాడ్ని చంపి గానీ శాంతించను ….పదా! వాడు ఎక్కడ దాక్కున్నాడో చూపించు, వాడిని నాశనం చేస్తా,” అంటూ బయల్దేరింది. “చిత్తం మహా రాజా! ఆ సింహం ఒక కోట లో ఉంది. దయచేయండి నా తో. ఈ రోజు వాడికి మీ చేతిలో చావు తప్పదు ,” అన్నట్టు ముందు వేగంగా నడుస్తూ, ఒక బావి దగ్గిర ఆగి, అందులోకి చూడమని సైగ చేసింది.

అది గట్టిగా గర్జిస్తూ నీటిలో తన నీడని చూసి, తన శత్రువే అనుకుని, ఒక్క దూకులో బావి లో పడి, మునిగి చచ్చిపోయింది. ఆ రోజునించీ సింహం బెడద అందరికీ తప్పినందుకు కుందేలు ని ఎంతో అభినందించాయి జంతువులన్నీ.

నీతి: ఈ తెలివితో అపాయాన్ని తప్పించుకోవచ్చు .

20. మూడుచేపలు

3 Fishes

ఒక చెరువులో దూరదర్శి, కుశాగ్రబుధ్ది, మందబుద్ధి అనే మూడు చేపలు ఉండేవి. ఒక సంవత్సరం వానలు పడక, చెరువు ఎండిపోతోంది. నీరు బాగా తగ్గింది. అది గ్రహించి, దూరదర్శి, మిగిలిన రెండు చేపలతో,”స్నేహితులారా! వానలు లేక,మన చెరువు రోజు రోజుకి ఎండిపోతోంది. జాలరులు వొచ్చి, మనని పట్టేసే ప్రమాదం కూడా ఉంది. కనుక మనం మరో చెరువుకి ఈ సన్న నీటిమార్గం ద్వారా వెళ్ళిపోదాం రండి,” అని పిలిచింది.

ఎప్పుడో ఆపద వొస్తుందని ఇప్పుడే పారిపోవటమెందుకు? అంతగా అపాయం వస్తే చూద్దాం లే” అంది కుశాగ్ర బుద్ది. మందబుద్ధి, “నేను ఈ చెరువు లోనే పుట్టాను. ఏది ఏమైనా ఇక్కడినించి కదిలేది లేదు,” అని మొండికేసింది.

ఇంక వీళ్ళతో కుదరదనుకుని, దూరదర్శి గబా గబా ఈదుకుంటూ మరో చెరువు లోకి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకి జాలరులు వొచ్చి, వల వేసి చేపల్నిపెట్టే శారు. వలలో చిక్కిన చేపలలో బతికి ఉన్నవాటిని తన బుట్టలో వేస్తున్నాడు. కదలకుండా ఉన్నచనిపోయిన చేపల్ని ఒడ్డున పడేస్తున్నాడు. అది గమనించిన కుశాగ్రబుద్ధి, గుడ్లు తేలేసి,కదలక ఉండిపోయిన్నది. అది చూసి జాలరి చేప చచ్చిపోయిందనుకుని చెరువు గట్టున వొదిలేసాడు. నెమ్మదిగా అది ఎలాగో చెరువులో చేరి బతికి పోయింది. మందబుద్ధి మటుకు ఏమీ తోచక జాలరి చేతిలో చిక్కి చచ్చిపోయింది.

నీతి: ముందు చూపుతో మిత్రులు చెప్పే మాట వినాలి.

కాకేలుకేయం (పక్షుల మధ్య రాజకీయం)

21. కాకులు, గుడ్లగూబ కధ

Crows, owl story

కాకులు, గుడ్లగూబలు శత్రువులెందుకయ్యారో తెలుసుకుందాం. పక్షులన్నీ తమకి ఒక నాయకుడు కావాలని తలిచాయి. ప్రస్తుతానికి గరుడుడు ఉన్నాడుకాని, ఏమీ అంత ప్రయోజనం లేదు. ఎంతసేపు తన స్వామి సేవలో ఉంటాడు. తన వేట, తన గోల తప్ప ఏమీ పట్టవు, అని అందరూ సమావేశమై చర్చించుకుంటున్నారు.

కాకులు రాలేదు. గుడ్లగూబ ని రాజుగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. గుడ్లగూబకి చెప్పే శారు ఆ రోజే పట్టాభిషేకం అని. అప్పుడు కాకి వొచ్చింది. “ఏమిటీ హడావిడి?” అని అడిగింది. పక్షులన్నీ కలిసి, గుడ్లగూబని రాజుని చెయ్యాలని తీర్మానించామని చెప్పారు. దానికి, “ఛీ! గుడ్లగూబ ఏమి అందంగా ఉంటుంది, పైగా పగలంతా సరిగ్గా చూడలేదు, రాత్రి బాగా చూస్తుంది గాని రాజుగా తగదు. దాని బుధ్ధి మంచిదికాదని విన్నా, గరుడుడు గంభీరంగా, మంచి బలంగా ఉంటాడు. అంతేకానీ గుడ్లగూబ అస్సలు సరిపోదని ,” చెప్పింది.

జరుగుతుందన్న పట్టాభిషేకం ఈ మాటలవల్ల ఆగిపోయింది. గుడ్ల గూబకు చాలా కోపం, నిరాశ వొచ్చి, “ఈ రోజునించీ కాకులతో మేము ఈ జన్మ లో స్నేహం చెయ్యమని,” శపధం చేసింది. అయ్యో ఎవ్వరూ అడగక పోయినా సలహా ఇచ్చి అనవసరమైన శత్రుత్వం తెచ్చు కున్నామే, అని కాకులు విచారించాయి.

నీతి: అడగనిదే ఎవ్వరికి సలహా ఇవ్వరాదు.

మామ్జంక్షన్ లో మీ చిన్నారుల కోసం కొన్ని పంచతంత్ర కధలని పొందుపరచాము. పిల్లల అల్లరికి కూడా ఈ కధలు మంచి తాయిలాలు గా పనికి వొస్తాయి. ”కథ చెపుతాను” అంటే , పిల్లలు బుద్దిగా వింటారు. హుషారైన అమ్మలూ!మరి ఇవి వినిపించి, వాళ్ళల్లో కధల పట్ల ఆసక్తిని పెంచండి.

మీరు ఇంకేమన్నా కథలు చెప్పాలనుకుంటున్నారు. మాకు కామెంట్స్ సెక్షన్ లో చెప్పండి.

Was this article helpful?
thumbsupthumbsdown

Community Experiences

Join the conversation and become a part of our vibrant community! Share your stories, experiences, and insights to connect with like-minded individuals. Let our readers get your unique perspectives and do better together! Read our Comment Policy to know about the guidelines.

Aastha Sirohi
Aastha SirohiBeauty & Lifestyle Writer
Aastha Sirohi is a beauty and lifestyle content writer with over three years of experience in writing for different genres. She has a master’s degree in English Literature from The English And Foreign Languages University and a bachelor’s degree in education from the University of Mysore.

Read full bio of Aastha Sirohi
Latest Articles